కిరణ్ టీవీ, ఉత్తర కొరియా :- ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు పాల్గొంటున్నారన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ యుద్ధంలో సుమారు 300 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారని, 2,700 మంది గాయపడ్డారని.. దక్షిణ కొరియా చట్టసభ సభ్యుడొకరు తెలిపారు. ఈ సమాచారం.. దక్షిణ కొరియా నిఘా వర్గాల నుంచి తెలిసిందని వెల్లడించారు. ఉత్తర కొరియా – దక్షిణ కొరియా రెండు బద్ధ శత్రువులుగా ఉంటాయి. ఇవి రెండూ కొరియా నుంచి విడిపోయినా.. దక్షిణ కొరియాపై యుద్ధాన్నే ఉత్తర కొరియా కోరుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో.. కిమ్ సైన్యం యుద్ధ నైపుణ్యాల్ని, వారి యుద్ధ పద్ధతుల్ని ద.కొరియా నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. వారం తెలిపారు.
యుద్ధ క్షేత్రంలో ఉ.కొరియా సైనికులు ఇద్దరు తమ దళాలకు చిక్కారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిరి జెలెన్ స్కీ ప్రకటించారు. వారికి సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. ఆ సైనికుల్ని విడుదల చేయాలంటే.. రష్యాలోని తమ సైనికుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే.. ఉత్తర కొరియా సైనికులను వారి స్వదేశాని పంపిస్తామని తాజాగా ప్రకటించారు.
ఉక్రెయిన్ – రష్యా సరిహద్దులోని కుర్క్స్ ప్రాంతంలో కొన్నాళ్లుగా ఇరు దళాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ ప్రాంతంలోనే ఇద్దరు కిమ్ సైనికుల్ని ఉక్రెయిన్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. మరికొందరిని పట్టుకునేందుకు తమ దళాలు ప్రయత్నిస్తున్నాయని ప్రకటించారు. జెలెన్ స్కీ విడుదల చేసిన వీడియోలో.. ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని ఉక్రెయిన్ అధికారులు విచారిస్తున్నట్లు వీడియోలో ఉంది. తమకు ట్రైనింగ్ అని చెప్పి యుద్ధ క్షేత్రానికి తరలించారని చెప్పిన ఓ సైనికుడు.. వారం రోజులుగా ఆ ప్రాంతంలో తాము యుద్ధంలో ఉన్నామని వెల్లడించారు.
ఉత్తర కొరియాకు తిరిగి వెళతారా అని ఓ సైనికుడిని ప్రశ్నించగా.. వెళతానని తెలిపాడు. పట్టుబడిన సైనికుల గురించి వివరాలు వెల్లడించిన ఉక్రెయిన్ భద్రతా సర్వీస్ ఎస్బీయూ అధికారులు.. ఒక సైనికుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, ఒకరి దగ్గర మాత్రం రష్యా మిలిటరీకి సంబంధించిన కార్డు ఉందని వెల్లడించారు. గత కొన్నాళ్లుగా.. ఉ.కొరియా సైనికులకు రష్యా గుర్తింపుతో పత్రాలు ఇస్తున్నారన్న వాదనలకు ఇది బలం చేకూర్చినట్లైంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా 10వేల మంది సైనికుల్ని ఉ.కొరియా నియంత కిమ్ పంపించాడని ఆరోపణలు ఉండగా.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. సైనికులకు ప్రతిగా.. భారీగా ఆయుధాలు, సాంకేతికతలు, డ్రోన్ల టెక్నాలజీని ఉ.కొరియా తీసుకుందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఏదిఏమైనా.. యుద్ధ క్షేత్రంలో ఉత్తర కొరియా సైనికులు భారీ సంఖ్యలో మరణిస్తున్నారంటూ జెలెన్ స్కీ ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు.. ఇద్దరు ఉత్తర కొరియా సైనికుల వీడియోలు విడుదల చేసి.. తాను చేస్తున్న ఆరోపణలు నిజమైనవేనని నిరూపించారు.
భీకర యుద్ధంలో ఉత్తర కొరియా సైనికుల్ని ప్రాణాలతో పట్టుకోవడం ఈజీ కాదన్న జెలెన్ స్కీ.. యుద్ధంలో చనిపోయినా వారి గుర్తింపు తెలియకుండా రష్యా వ్యవహరిస్తోందని అంటోంది. ఇందుకోసం.. ఉ.కొరియా సైనికుల ముఖాల్ని కాల్చేస్తున్నారని, వారి గుర్తింపు కార్డుల్ని మార్చేస్తున్నారని తెలిపారు. అయితే.. ఆయా సైనికుల ఇంటర్నల్ కమ్యూనికేషన్లను సీక్రెట్ గా విన్నప్పుడు తమకు ఈ విషయం తెలిసిందని, తర్వాత.. చనిపోయన సైనికులను నిశితంగా పరిశీలించి నిర్థరించుకున్నట్లు వెల్లడించారు.