కిరణ్ టి.వి, హైదరాబాద్ :- మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు నిందితురాలిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కేటీఆర్ ఫిర్యాదు.. ఆరోపణల వివరాలు :-
ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాలు, అంతేకాకుండా నటి సమంత విడాకుల వివాదం వంటి అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఈ ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని పేర్కొంటూ కేటీఆర్ పరువు నష్టం దావాను దాఖలు చేశారు. కేటీఆర్ దాఖలు చేసిన ఈ పరువు నష్టం దావాను బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది.
కొండా సురేఖ న్యాయవాది అభ్యంతరాల తిరస్కరణ :-
ఈ కేసు విచారణ సందర్భంగా మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది కోర్టులో కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, అలాగే ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి వంటి అంశాలపై వారు అభ్యంతరాలు లేవనెత్తారు. అయితే, కొండా సురేఖ న్యాయవాది వ్యక్తం చేసిన ఈ అభ్యంతరాలను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది.
కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలను న్యాయస్థానం ఏకీభవించింది. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది బలంగా వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు, నిందితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
